నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Sunday, February 27, 2011

రజనీ దెబ్బకి మైండ్ బ్లాకయిన అమితాబ్


(ఇది నాకు మెయిల్‌లో వచ్చిన జోక్. కొద్దిగా మసాలా అద్ది ఇక్కడ పోస్టు చేస్తున్నాను)


అది NDTV వాళ్ళు entrtainer of the decade అవార్డు ప్రధానం చేస్తున్న సభా వేదిక. రజనీ కాంత్ కొంచెం ముందుగానే వచ్చి ఒక టేబిల్ వద్ద కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఐశ్వర్యా రాయ్ వచ్చింది. "నమస్తే, సార్" అని విష్ చేసింది రజనీని చూసి. "ఏమ్మా, బావున్నావా" అని అడిగాడు రజనీ. "బావున్నాను సార్" అని ఆయన పక్కన్ కుర్చీలో కూర్చుంది. వెనకాలే వచ్చిన అమితాబ్‌కి అది నచ్చలేదు. చకచకా వచ్చి, "హలో రజనీ, హౌడూయూడూ" అని ఐశ్వర్యకీ రజనీకి మధ్యలో కుర్చీ లాక్కుని కుర్చున్నాడు. ఆ వెనకాలే వస్తున్న అభిషేక్ ఈ సీన్ చూసి కొంచెం సంతోషంగా నిట్టూర్చి తనూ ఐష్ పక్కన మరో కుర్చీలో కూర్చున్నాడు.
    


అమితాబ్, రజనీ కబుర్లలో పడ్డారు. మాటల మధ్యలో రజనీ ఎందుకో తన గురించి తను అతిశయోక్తితో గొప్పలు చెప్పుకుంటున్నాడని అమితాబ్‌కి అనిపించింది. "ఏమిటి రజనీ, నువ్వెంత సౌత్ సూపర్‌స్టార్ అయితే మాత్రం నీకు అందరూ తెలుసు, నువ్వు అందరికీ తెలుసు అనడం నాకంత నమ్మశక్యంగా లేదు" అన్నాడు అమితాబ్.


"సరే, ఇక్కడే చూపిస్తాను నీకు చూడు" అన్నాడు రజనీ. "అదీ చూద్దాం" అన్నాడు అమితాబ్. ఆ ప్రోగ్రాం జరుగుతున్నది బొంబాయిలో కాబట్టి రజనీకన్నా తనే అక్కడ ఎక్కువ పాపులర్ కదా అన్న నమ్మకంతో.


ఇంతలో అవార్డు ప్రధానం చేయాల్సిన చిదంబరం లోపలికి వచ్చాడు. నేరుగా వీళ్ళు కూర్చున్న టేబిల్ వద్దకు వచ్చి"ఎన్న రజనీ, సౌఖ్యమా" అనడిగి వెళ్ళిపోయాడు అమితాబ్ వైపు చూడకుండా. ఇప్పుడేమంటావ్ అన్నట్టు చూశాడు రజనీ. "మీరిద్దరూ సాంబార్ గాళ్ళే కదా. అదీ సంగతి" అన్నాడు అమితాబ్. కాస్సేపటికి నోబుల్ ప్రైజ్ విన్నర్ అమార్త్య సేన్ లోపలికి వచ్చాడు. ఖచ్చితంగా ఇతనికి రజనీ తెలిసే అవకాశం లేనేలేదు అని నమ్మకంగా అతని వైపు చూస్తూ ఉన్నాడు అమితాబ్. సేన్ కూడా నేరుగా వీళ్ళ వద్దకి వచ్చి రజనీని పలకరించి అమితాబ్ వైపు చూడకుండా వెళ్ళిపోయాడు. ఎప్పుడో చెన్నైకి వెళ్ళినప్పుడు ఏదో సందర్భంలో ఇద్దరూ కలిసి ఉంటార్లే అనుకొని, "కాస్సేపు చూద్దాం రజనీ" అన్నాడు అమితాబ్ బింకంగా. ఆ తరువాత మిజోరాం నుండి ఒక సామాజిక కార్యకర్త, ఉగాండా దేశం రాయబారి లోపలికి రాగానే నేరుగా రజనీ వద్దకి వచ్చి పలకరించడంతో అమితాబ్ డైలమాలో పడ్డాడు.


కాస్సేపటిలో కార్యక్రమం పూర్తయింది. అమితాబ్ రజనీని వదలకుండా తన కారులో ఎక్కించుకొని తీసుకుపోయాడు. "రజనీ, నీకు హాలీవుడ్‌లో ఏంజెలీనా జోలీ తెలుసా?" అనడిగాడు. "చాలాబాగా తెలుసు. కనీసం వారానికొక సారయినా ఫోన్ చేసి మాట్లాడుతుంది" చెప్పాడు రజనీ. అమితాబ్‌కి నమ్మకం కలగలేదు."కొయ్..కొయ్.." అని మనసులో అనుకొని, "సరే. నేను చూస్తే కానీ నమ్మను" అన్నాడు. ఇద్దరూ ఆ మరుసటి రోజే అమెరికాకి ప్రయాణమయ్యారు. 


ఏంజెలినా జోలీ భవనం గేటు ముందు సెక్యూరిటీ గార్డు వీళ్ళ టాక్సీని ఆపి లోపల రజనీని చూడగానే సెల్యూట్ చేసి గేటు ఓపెన్ చేశాడు. అమితాబ్‌కి కాస్త ఆశ్చర్యమేసినా బింకంగా కూర్చున్నాడు. లోపల అంతా హడావిడిగా ఉంది. ఏంజెలినా పర్సనల్ స్టాఫ్ అందరూ బయట రెడీగా నించుని ఉన్నారు. ఆ సమయంలో లోపలికి వచ్చిన తాక్సీని చూసి ఆమె బాడీ గార్డు కొపంగా పరుగెత్తుకొచ్చాడు. అయితే లోపలనుంచి దిగుతున్న రజనీని చూడగానే అటెన్షన్‌లో నిలబడి సెల్యూట్ చేశాడు. " హాయ్,మాక్స్!హౌ డూ యూ డూ? ఈజ్ ఏంజీ గోయింగ్ ఫర్ షూటింగ్?" అనడిగాడు రజనీ. "ఎస్సర్" అని చెప్పాడు సదరు మాక్స్. ఇంతలో లోపలనుండి జీన్స్, టీ షర్ట్‌లో చక చకా నడుచుకుంటూ ఏంజెలీనా, ఆమె పక్కన బ్రాడ్‌ పిట్ బయటకొచ్చారు.

  
"హాయ్, తలైవా" అని పెద్దగా అరుచుకుంటూ వీళ్ల దగ్గరకొచ్చింది ఏంజెలీనా. బ్రాడ్ పిట్ తన జేబు లోంచి సెల్ ఫోన్ తీసి, ఎవరితోనో "షూటింగ్ ఇస్ కేన్సిల్‌డ్ టుడే" అని చెప్తున్నాడు. రజనీ చక చకా అతని వద్దకెళ్ళి, ఫోన్ తీసుకొని," No,Bradd. Don't cancel the shoot. Work is worship. We will leave in few moments" అని చెప్పాడు.


రజనీ, అమితాబ్ అక్కడి నుండి బయటకొచ్చారు. టాక్సీలో కూర్చున్నాక" రజనీ నీకు బరాక్ ఒబామా తెలుసా" అనడిగాడు అమితాబ్. "భలే వాడివే. పోయిన ఎలక్షన్‌లో వచ్చి తన తరఫున ప్రచారం చేయమని చాలాసార్లు అడిగాడు. రాజకీయాల రొంపిలోకి దిగనని తప్పించుకున్నాను. సరే పద DC దాకా వెళ్ళొద్దాం" అని ఇద్దరూ వాషింగ్‌టన్ వెళ్ళే విమానం ఎక్కారు.
     
వైట్‍హౌస్‌కి అరమైలు దూరంలోనే అన్ని వాహనాలని ఆపేస్తున్నారు. రజనీ టాక్సీలోంచి తల బయట పెట్టి అక్కడున్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వైపు చూసి చేయి ఊపాడు. అతను చకచకా పరుగెత్తుకొచ్చి రజనీకి సెల్యూట్ చేసి," మిస్టర్ ప్రెసిడెంట్ ఈజ్ లీవింగ్ ఫర్ ఏ మీటింగ్ విత్ రష్యన్ ప్రెసిడెంట్" అని ఇంగ్లీషులో చెప్పి లోపలికి వెళ్ళమన్నట్టు టాక్సీ డ్రైవర్‌కి సైగ చేశాడు. టాక్సీ నేరుగా వైట్‌హౌస్ ముందుకి వెళ్ళి ఆగింది. లోపల అంతా హడావిడిగా ఉంది. ఒక పది నల్లటి ఓడల్లాంటి కార్లు వరసగ నించుని ఉన్నాయి. వాటి చుట్టూ నల్ల కోట్లు వేసుకుని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అటెన్షన్‌లో నించుని ఉన్నారు. 


ఇంతలో లోపల నుండి నల్ల సూట్‌లో బరాక్ ఒబామా చక చకా బయట కొచ్చాడు. బయట రెడిగా ఉన్న ఒక ఆఫీసర్ ఆయన చెవిలో ఏదో చెప్పాడు. ఒబామా మొహంలో చిరునవ్వు మెరిసింది. ఆయన తన కేన్వాయ్ వైపు వెళ్ళకుండా నేరుగా రజని ఉన్న టాక్సీ వైపు వచ్చాడు. రజనీ ఆయన్ని చూసి కారు దిగాడు. చేతులు జోడించి "నమస్తే" అన్నాడు ప్రెసిడెంట్. రజని ఆయన్ని కౌగిలించుకున్నాడు. ఒబామా తన జేబులోంచి తన బ్లాక్‌బెర్రీ తీసి ఒక నంబర్ డయల్ చేసి."మిషెల్లీ! రజనీ సార్ బయట ఉన్నారు. చక చకా మంచి కాఫీ రెడీ చెయ్యి. ఎవరినైనా పంపించి ఇండియన్ రెస్టారెంటు నుండి దోశెలు. ఇడ్లీ సాంబార్ తెప్పించు" అని చెప్పాడు. "నో,నో! పని మీద వెళ్తున్నట్టున్నావు. లేట్ చేయడం మంచిది కాదు. ఈ సారి తీరిగ్గా కలుద్దాం" అన్నాడు రజనీ ఒబామా చేతిలోంచి ఫోన్ పక్కకి తీసి.


 
"సరే ఇక్కడి నుంచీ ఎక్కడికీ సార్ మీ ప్రయాణం ఇండియాకేనా, మరెక్కడికైనానా?" అడిగాడు ఒబామా. అమితాబ్ వైపు చూశాడు రజనీ. అప్పటికి తేరుకున్న అమితాబ్ రజనీ చెవిలో "నీకు పోప్ కూడా తెలుసా రజనీ?" అనడిగాడు. రజనీ ఒబామా వైపు తిరిగి "నా ఫ్రెండ్ పోప్‌ని కలవలనుకొంటున్నాడు" అని చెప్పాడు. ఒబామా తన కోసం వెయిట్ చేస్తున్న ఏజెంట్లలో ఒకరిని పిలిచి, " వీళ్ళిద్దరినీ నా పర్సనల్ ఫ్లైట్‌లో వాటిక‌న్‌కి తీసుకెళ్ళమని చెప్పు" అన్నాడు.అమితాబ్ కళ్ళు గిర్రున తిరగడం మొదలయింది.


ఆదివారం ఉదయం కావడంతో వాటికన్ చాలా రద్దీగా ఉంది. కాస్సేపటిలో పోప్ చర్చి పైన నుండి చేయి ఊపి భక్తులని ఆశీర్వదిస్తారని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. "ఇంత మందిలో మనం పోప్‌కి కనిపించం గానీ, నువ్వు ఇక్కడ నుంచి చూస్తూ ఉండు, నేనూ, పోప్ కలిసి బయటకొచ్చి చేయి ఊపుతాం" అన్నాడు రజనీ. "రజనీ ఇక్కడ సెక్యూరిటి బాగా టైట్‌గా ఉంది కదా" అన్నాడు అమితాబ్. "డోంట్ వర్రీ. అందరూ మనకి తెలుసులే" అని వడి వడిగా జనంలోకి వెళ్ళాడు రజనీ. కాస్సేపటిలో జనంలో కల కలం మొదలవడంతో అందరూ చూస్తున్న వైపుకి చూశాడు అమితాబ్. 
 


అక్కడ పోప్ బెనెడిక్ట్ పైన చేయి వేసి బయటకొచ్చి చేయి ఊపుతున్నాడు రజనీ. అమితాబ్ పక్కన ఒక ఇటాలియన్ నిల్చుని ఉన్నాడు. "సార్ నాకొక విషయం చెప్తారా?" అనడిగాడు అతని ఇంగ్లీషులో అమితాబ్‌ని. అమితాబ్ తలుపాడు. "అక్కడ చేయి ఊపుతున్న రజనీని చూడండి. ఆయన పక్కన తెల్ల గౌను వేసుకొని టోపీ పెట్టుకొని చేతిలో కర్ర పట్టుకొని నించుని ఉన్న ఆ ముసలోడెవరో కొంచెం చెప్తారా".

అప్పుడు అమితాబ్‌కి మైండ్ బ్లాకయి కింద పడి పోయాడు.

తనకి ఉరిశిక్ష ఖరారయిందని విని కసబ్ ఎందుకు నవ్వాడు?


హై కోర్టు కసబ్‌కి ఉరుశిక్ష ఖరారు చెసిందని వినగానే వాడు నవ్వాడని ఈ ఉదయం న్యూస్ పేపర్లలో వార్త చూసి నాకు ఒక క్షణం ఆశ్చర్యమేసింది. మరణ శిక్ష పడ్డ వాడెవడికైనా అలా నవ్వు వస్తుందా? ఎంతో వేదాంత పూరిత ధృక్కోణం ఉండేవాళ్ళకో, భగత్ సింగ్ లాంటి వారిలాగా ఉదాత్తమైన ఆశయం కోసం ఉరికంబమెక్కబోయేవాళ్ళకో అలా నవ్వు వస్తుంది కానీ ఈ నీచుడికి ఎందుకొచ్చిందా అని కొంత ఆశ్చర్యపోయినా కాస్సేపటికి నాకర్ధమయింది వాడికెందుకు నవ్వు వచ్చిందో. అయినా పైకి ఎలా నవ్వినా కసబ్ మాత్రం లోపల్లోపల పడి పడీ విరగనవ్వుకొని ఉంటాడు. ఎందుకలాగా అనుకొంటున్నారా కొంచెం ఈ వాస్తవాలు చూడండి.
    


కసబ్ అనే వాడు పరాయి దేశం నుండి వచ్చి తుపాకీ చేత బట్టుకొని ముంబయి నగరంలో ముందూ వెనుకా చూడకుండా ఆడ మగా పిల్లా జెల్లా ముసలి ముతకా ఎవరు కనిపిస్తె వాళ్ళని తుపాకి గుళ్ళకి ఆహుతి చేసి మారణ హోమం సాగిస్తే వాడిని మొత్తానికి పట్టుకున్నారు. వచ్చిన ముష్కరుల మూకలో ఒకడినయినా ప్రాణాలతో పట్టుకుంటే వాళ్ళ వెనుక ఎవరున్నారో ప్రపంచానికి ఋజువు చేయవచ్చు అన్న ఆలోచనతో. బాగావుంది. వాడిని అరెస్టు చేయగానే ఆర్థర్ రోడ్ జైలుకి తరలించి అక్కడ భద్రత సరిగా లేదని నిపుణులని సంప్రదించి ఒక హై సెక్యూరిటీ సెల్ ఈ నీచుడి కోసం ప్రత్యేకంగా నిర్మించారు. బంబులు వేసినా ఆ సెల్లుకీ అందులో ఉన్న ఈ నికృష్టుడికీ ఏమాత్రం హాని జరగనంత పటిష్టంగా కట్టారట ఆ సెల్లుని.



ఇక వాడికి ఎప్పుడైనా అనారోగ్యం కలిగితే అడ్మిట్ చేయడానికని జేజే ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు నిర్మించి అక్కడ సెక్యూరిటీ కష్టమని కసబ్ ఉండే జైలులోనే ఒక హాస్పిటల్ కూడా నిర్మించారు. వీడి ఆరోగ్యం చూసుకోవడానికి ఇద్దరు డాక్టర్లు నిరంతరం వీడిని పర్యవేక్షిస్తూ ఉంటారు. రోజుకి 9 లక్షల రూపాయల చొప్పున ఇప్పటికి మనవాళ్ళు వీడిపైన పెట్టిన ఖర్చు అక్షరాలా 45 కోట్లు. ఇది ఇంతటితో అయిపోలేదు. మన ప్రభుత్వ ఖర్చుతో రేపు సుప్రీమ్ కోర్టుకి అప్పీలు చేసి అక్కడా ఉరిశిక్ష విధించినా కథ సమాప్తం అవదు.
   


వాడు రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇప్పటికే క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉన్న దరఖాస్తులన్నీ క్లియర్ అయ్యి ఈ నీచుడి వంతు వచ్చి అప్పటికీ మన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తప్ప ఆ ఉరి అమలవదు. అప్పటికి అధికారంలో ఉన్న పార్టీకి మైనారిటీ ఓట్లు అవసరమైతే ఏ రంజాన్‌నాడో, మొహర్రం నాడో ఈ వెధవకి క్షమా భిక్ష లభించినా లభించవచ్చు. లేదా ఈ తంతు మొత్తం ముగిసేలోగా కూర్చుని తినడం వల్ల వంట్లో కొవ్వు ఎక్కువై బీపీ, షుగర్ లాంటి జబ్బులొచ్చి ఏ గుండె పోటుతోనో సహజ మరణం వచ్చి చచ్చినా చావొచ్చు.
  
"పరాయి దేశం నుండి వచ్చి జనాన్ని కుక్కల్ని కాల్చినట్టు కాలిస్తే నాకు ఇంత రాచ మర్యాదలు ఇస్తున్న మిమ్మల్ని ఏమనాలో నా కర్ధం కావడం లేదు" అని మనసులో అనుకొని లోలోపల నవ్వుకొని ఉంటాడు ఈ కసబ్ అనే పిచ్చి కుక్క.

Sunday, February 20, 2011

ఎయిడ్స్ జబ్బు ఎక్కించడమే లక్ష్యంగా వంద మందితో శృంగారం జరిపిన పురుష ద్వేషి


ముంబయి నగరంలో గ్రాంట్ రోడ్‌లో డాక్టర్ I.S. గిలాడా క్లినిక్ ఉంది. ఎయిడ్స్ పేషంట్లకు చికిత్స మరియు కౌన్సిలింగ్ చేస్తుంటాడాయన. ఎయిడ్స్ అనేది శరీరంకన్నా మనసుని ఎక్కువగా డామేజ్ చేస్తుంది అని నమ్ముతాడాయన. అందుకే HIV పేషంట్లకి చలా ఓపిగ్గా కౌన్సిలింగ్ ఇస్తాడు గిలాడా. ఒకసారి ఆయన దగ్గరకు వచ్చిన ఒక పాతికేళ్ళ యువతి చెప్పిన నిజం విని షాకయ్యాడు ఆయన. 


 
ఆమె తన భర్త నుంచి తనకి ఎయిడ్స్ అంటుకున్నాక అతనికి విడాకులిచ్చి అక్కడక్కడా మధ్య తరగతి, ఉన్నత తరగతి ఇళ్ళలొ పని చేస్తూ జీవనం సాగిస్తూ గత రెండు నెలలుగా గిలాడా క్లినిక్‌కి వైద్యం కోసం వస్తూంది. క్రమేపీ ఆమెకి తన మీద నమ్మకం కలిగించాడు గిలాడా ఓపిగ్గా ఆమె చెప్పేదంతా సానుభూతితో వినడం ద్వారా. గిలాడామీద పూర్తి నమ్మకం ఏర్పడ్డాక ఆమె అతనికి ఒక బాంబు లాంటి నిజం చెప్పింది.


తన భర్త అతనికి ఎయిడ్స్ ఉందని తెలిసి తనతో సెక్స్‌లో పాల్గొని తనకు ఆ జబ్బు అంటించాడని తెలిసి ఆమెకి పురుష జాతి అంటేనే ద్వేష భావం పుట్టి, మగ వాళ్ళందరి మీదా పగ తీర్చుకొనే ప్రయత్నంలో ఉందని ఆమెతో మాట్లాడాక అతనికి అర్ధమయ్యింది. ఆ మిషన్‌లో భాగంగా ఆమె ఇప్పటి వరకూ 100 మందికి పైగా మగ వారితో ౩౦౦ సార్లకి పైగా ఎటువంటి కండోమ్ లాంటి రక్షిత విధానాలు లేకుండా శృంగారంలో పాల్గొన్నానని ఆమె గిలాడాతో చెప్పింది.

 తనకి కావలసిన మగవాళ్ళ కోసం ఈ అమ్మడు తన యజమానులని, వాళ్ళ ఇంట్లో ఎవరయినా టీనేజ్ కుర్రాళ్ళని, వాళ్ళ ఫ్రెండ్స్‌ని, ఆటో,టాక్సీ డ్రైవర్లనీ ఇలా వల వెసి పట్టేదట. ఈ విషయాలు విని దిమ్మ తిరిగి మైండ్ బ్లాకయిన గిలాడా ప్రాంప్ట్‌గా విషయాన్ని National AIDS Control Organisation (NACO) వారికి తెలియ జేసాడు. ఆమెకి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె మనఃస్థితిని సరయిన దారిలో పెడుతామని NACO అధికారులు చెప్పడం ఈ కథకి కొసమెరుపు.
 


***Tiimes of India వారి  వెబ్ సైట్‌లో ఈ స్టోరీకి వచ్చిన కామెంట్లలో ఒకటి అవేశపూరిత మైనది. తెలిసి తెలిసి 100 మందికి  జబ్బు అంటించిన ఆమెకి మరణమే తగిన శిక్ష అని ఆ కామెంటు. దానికి రెస్పాన్సుగా, తెలిసి తెలిసి ఫ్రీగా వస్తుందని ఆమెతో సెక్సులో పాల్గొన్న వారిది కూడా తప్పు అని ఒక రెస్పాన్సు. ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడతానని ఎవరైనా పిలిస్తే ఆబగా పోయి తింటారు. అందులో విషం ఉందా లేదా అని చూస్తారా అని దీనికి మరో రెస్పాన్సు.  ఆకలేస్తే ఇంట్లో అన్నం తినాలి లేకపోతే మంచి హోటల్‌ని వెదికి చూసి పొయ్యి తినాలి. ఎవరంటే వాళ్ళు పిలిచి పెడతామనగానే  పొయ్యి తినడమేనా?

శరతన్నయ్యా! ఇక్కడ మీ అవసరముంది. జర చూడరాదే!


ప్రపంచంలో స్వలింగ సంపర్కుల హక్కుల గురించి ఎన్ని మార్పులొచ్చినా మన దేశంలో మాత్రం వాళ్ళ పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు అనడానికి డిల్లీలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనం. 
 
డిల్లీలో మంచి పోష్ లొకాలిటీ అయిన వసంత్ కుంజ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు యువతులు నివాసముండే ఫ్లాట్ మీద ముంబాయి, డిల్లీ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. అ హడావిడి చూసి ఇతర ఫ్లాట్‌లలో ఉండే వాళ్ళు బెదిరిపోయారు వాళ్ళు ఏ ఐఎస్‌ఐకో, లష్కర్‌కో చెందిన తీవ్రవాదులేమోనని. కానీ వాళ్ళు పాపం అంత ప్రమాదకరమైన వాళ్ళేమీ కాదు. వాళ్ళు చేసిన నేరమల్లా లెస్బియన్లు కావడమే.

వాళ్ళిద్దరూ ముంబయిలో ఒక కోచింగ్ సెంటర్లో కలిశారు. ఒకరినొకరు ఇష్టపడి కొద్ది కాలంలోనే ఒకరినొకరు ఇష్టపడి లెస్బియన్ బంధం ఏర్పరచుకొన్నారు. ఈ వ్యవహరం ఒకమ్మాయి ఇంట్లో వారికి నచ్చలేదు. ఇద్దరి బంధాన్ని విడదీయాలని పెద్దలు ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఈ ప్రేమజంట అక్కడినుంచి లేచిపోయి మొదట పూనేలో ఆ తరువాత బెల్గాంలో కాపురం పెట్టి చివరికి డిల్లీ చేరారు. 


వసంత్ కుంజ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ అద్దెకి తీసుకొని అన్యోన్యంగా సంసారం చేసుకుంటూండగా వీరి ఆచూకీ పెద్దలకి తెలిసింది. వాళ్ళు అన్యోన్యంగా బతుకుతున్న మన ప్రేమికురాళ్ళని విడదీసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దానితో బెంబేలెత్తిన ఈ జంట ఇలాంటి విషయాలలో సహాయం అందించే సంగిని అనే ఒక స్వచ్చంద సేవా సంస్థ సాయం అర్ధించారు. ఈలోగా ఈ కుటుంబ పెద్దలు ఈ విషయాన్ని National Council for Women  చైర్‌పర్సన్ గిరిజా వ్యాస్ దృష్టికి తీసుకెళ్ళారు. తనకి వెనక్కి వెళ్ళడం ఇష్టం లేదని, తమిద్దరం ఒకరినొకరు పూర్తిగా ఇష్టపడే కలిసి జీవిస్తున్నామని ఆమె ముంది స్టేట్‌మెంట్ ఇచ్చారు ఈ అమ్మాయిలు.
 
ఇది  జరిగిన కొన్నాళ్లకి ఇంట్లోంచి లేచిపొయే సమయంలో ఇంట్లోని నగలు, డబ్బూ తీసుకెళ్ళిందని ఒక అమ్మాయి కుటూంబ సభ్యులు ముంబయిలో పోలీసులకి ఫిర్యాదు చేశారు. ముంబయి పోలీసులు ఒక టీం డిల్లీకి వచ్చి కొందరు లోకల్ పోలీసులతో కలిసి వీళ్ళు ఉంటున్న ఫ్లాట్ మీద శనివారం రాత్రి దాడి చేశారు. భయంతో ఠారెత్తిన ప్రేమ జంట ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని సంగిని స్వచ్చమ్ద సంస్థ వారికి ఫోన్ చేయడంతో సమయానికి వాళ్ళు వచ్చి అరెస్టుని అడ్డుకున్నారు. ఈలోగా మరింత మంది కార్యకర్తలు అక్కడకి చేరుకోవడంతో అరెస్టు కార్యక్రమాన్ని వాయిదా వేసి పోలీసులు వెనుతిరిగారు.
 
ప్రపంచంలో ఎన్ని మార్పులొచ్చినా గే, లెస్బియన్ బంధాలకు సంబంధించి మన దేశంలో ప్రజల ఆటిట్యూడ్‌లో ఏమాత్రం మార్పు రాలేదని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. మరి మన శరత్ అన్నయ్య ఏమంటారో?!