నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, October 23, 2012

మెంటల్ మేధావులు


నిన్న, సోమవారం మధ్యాహ్నం అలా చానల్స్ తిప్పుతూండగా టీవీ9 లో ఒక దృశ్యం కనిపించింది. ఒక సభ తాలూకూ ఫోటో అది. కొందరు వేదిక మీద కూర్చుని ఉన్నారు. వారి వెనక రావణ వర్ధంతి సభ అన్న బ్యానర్ ఉంది. ఇంతలో ఓ ఫోటో స్థానంలో కంచె ఐలయ్య కనిపించాడు. ఎంతైనా మేధావి కదా అని చానల్ మార్చకుండా చూశాను. అది ఒక చర్చా కార్యక్రమం. కంచె ఐలయ్య, బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి ఫోన్‌లో, మరొక ఆయన స్టూడియోలోనూ ఉంది చర్చిస్తూ ఉన్నారు. ఒక నిముషంలోనే విషయం అర్ధమై పోయింది. రామాయణంలో అసలు హీరో రావాణుడే అని ఐలయ్య సార్ అంటున్నారు. దానిని వాళ్ళిద్దరూ కౌంటర్ చెస్తూ ఉన్నారు.
 
అధికారం మొదటినుంచీ బ్రాహ్మణులూ, క్షత్రియులూ, రెడ్లూ, వెలమల చేతుల్లోనే ఉంది అని, ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు అది అంద లేదనీ అందులో భాగం రామాయణం అని ఒక వింత వాదన లేవనెత్తారు ఐలయ్య. అసలు రావణుడు పులస్త్య బ్రహ్మ వారసుడు అని, స్వచ్ఛమైన బ్రాహ్మణుడు అని ఆయనకి కౌంటర్ ఇచ్చారు స్టూడియోలోని వ్యక్తి (ఆయన పేరు తెలుసుకోలేక పోయాను). దానితో ఐలయ్యకి చిర్రెత్తుకొచ్చి, "నువ్వు బీసీవి, అగ్ర వర్ణాలవారికి బానిసగా వారికి కొమ్ము కాస్తున్నావ్" అని అంటే, "నువ్వు విదేశీ డబ్బుకి అమ్ముడు పొయ్యావ్" అని ఈయన కేకలేసుకున్నారు. అప్పుడు యాంకర్ కాస్సేపు బ్రేక్ తీసుకున్నాడు.
 
బ్రేక్ తరువాత ఐలయ్య తన విశ్వరూపం చూపించాడు. రావణుడిని, శూర్పణఖని, వాలినీ ఎస్సీ, ఎస్టీలుగా వర్గీకరించి పారేసి, రాముడు మహిళలని హింసించాడని ఒక అభియోగం మోపాడు. మీరు చెప్పిన ఈ ముగ్గురూ ఎస్సీ, ఎస్టీలకి ఏం చేశారయ్యా అన్న ప్రశ్నకి, వాళ్ళు వస్తు ఉత్పత్తి చేశారు అని, ఇరవయ్యో శతాభ్దం తాలూకూ కమ్యూనిస్టు భావజాలాన్ని త్రేతాయుగం నాటి పాత్రలకి అంట గట్టే ప్రయత్నం చేశాడు ఐలయ్య. ఒరేయ్ నాయనా అస్సలు రామాయణం మహా కావ్యాన్ని రాసిందెవరో నీకు తెలుసా అన్న ప్రశ్నకి, తెలంగాణాలో క్రీస్తు పూర్వం మల్లయ్య అని ఒక కవి ఉండేవాడు అని మొదలు పెట్టి నేను మూర్చపొయ్యేలా చేశారు ఐలయ్య గారు. క్రీస్తు పూర్వమే తెలంగాణా, రాయలసీమ, కోస్తాంధ్ర అని ఉండేవా అని షాకయ్యాను నేను.

శూర్పనఖని హింసించినందుకు లక్ష్మణుడు, అమ్దుకు ప్రోత్సహించినందుకు రాముడు శిక్షార్హులు అని ఐలయ్యగారి వాదన. ఇంకా నయం ఎలాగూ వాలి, శూర్పణఖ, రావణాసురల్ని ఎస్సీ, ఎస్టిలుగా తేల్చిపారేశాడు కాబట్టి వారితో యుద్ధం చేసినందుకు రామ లక్ష్మణుల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమంటాడేమో కంచె ఐలయ్య అని నేను భయపడుతూండగా చర్చని ముగించాడు యాంకరు. బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాను. 

Monday, October 22, 2012

రామ్ గోపల్ వర్మ: నభూతో భవిష్యతి


శివ సినిమా చూసి రామ్ గోపాల్ వర్మకి పిచ్చి అభిమానిగా మారిన ఒక ఫ్రెండు వర్మని నభూతో న భవిష్యతి అనే వాడు. అలాంటి దర్శకుడు ఇంతకు ముందు లేడు ఇకపైన రాడు అని వాడి ఉద్ధేశ్యం. ఒకా సినిమా చూసి అంత sweeping statement ఇవ్వడం మాకు అంతగా నచ్చక పోయినా తరువాత్తరువాత క్షణ క్షణం, గోవిందా గోవిందా లాంటి సినిమాలతో బోల్తా పడ్డా రంగీలా, కంపెనీ,గాయం లాంటి హిందీ సినిమాలతో మా వాడికి కొంత బలం చేకూర్చాడు RGV. ఆ తరువాత మనుషుల కన్నా తన శైలికి భూతాలయితేనే కరెక్ట్ అని భావించాడేమో గానీ రాత్రి, దెయ్యం లాంటి సినిమాలతో నభూతో నభవిష్యతి, భూతాల్లేకపోతే తనకి భవిష్యత్తు లేదు అని భావించాడేమో బాస్ అనిపించింది.
   
అయితే భూతాలు కూడా తనని దెబ్బ తీశాక వాటి మీద అలిగి సర్కార్ లాంటి మనుష్యుల సినిమాలు తీసి విజయాలు చవి చూసినా RGVకీ ఆగ్ లాంటి అతి ప్రయోగాలతో హిందీలో దెబ్బ తిని, తెలుగులోకి వచ్చి అప్పల్రాజుతో , బెజవాడ రౌడీలతో మళ్ళీ దెబ్బయిపోయాక, మానవ జాతి మీదే అలుక వహించి మళ్ళీ భూతమేవ శరణం, అన్యధా శరణం నాస్తి అనుకొని, భూత్ రిటర్న్స్ అని ఈసారి ఏకంగా 3Dలో ప్రేక్షకులతొ, మహేష్ బాబు బిజినెస్ మాన్‌లో బొంబాయిని ఏం చేయాలనుకున్నాడో అది చేయించాలనుకున్నాడు. అయితే ఎక్కడో ఒకటి రెండు సీన్లు మినహా మిగిలిన చోట్ల ఎక్కడయితే భయపెట్టాలనుకున్నాడో అక్కడ ప్రేక్షకులకి నవ్వు వచ్చింది.
 
ఇప్పటికయినా RGV తనకి నభూతో భవిష్యతి, భూతాల్లేకపోతేనే తనకి భవిష్యత్తు అని తెలుసుకుంటే మంచిది. శివ, గాయం, రంగీలా,కంపెనీ లాంటి పెద్ద పెద్ద హిట్లన్నీ ఆయనకి మనుష్యుల ద్వారా వచ్చినవే. భూతాలు ఎప్పుడూ తనకి చెయ్యి ఇచ్చాయే గానీ హిట్లు ఇవ్వలేదు. ఇప్పుడు నిరాశా, నిస్పౄహలతో ఇటు మనుష్యుల మీదా అటు భూతాల మీద అలిగి ఏ గ్రహాంతర వాసుల సినిమాలో తీయకుండా మళ్ళీ మనుష్యులలోకి వస్తే విజయ పధంలో ఒకట్రెండు అడుగులు వేయవచ్చేమో ఆలోచించండి వర్మగారూ.

Saturday, October 20, 2012

వక్షోజాలు ఉన్నది బిడ్డలకి పాలివ్వడానికే, అదే వాటికి క్షేమ దాయకం కూడా


మన శరీరంలో ప్రతి అవయవానికీ ఒక నిర్దిష్టమైన పని ఉంటుంది. మనల్ని దేవుడు పుట్టించాడని నమ్మే వాళ్ళు, లేక డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఇద్దరూ ఒప్పుకొనే మాట ఇది. స్త్రీలలో  వక్షోజాలుపాత్ర బిడ్డలకి పాలివ్వడం. మానవుల కన్నా పరిణామ క్రమంలో కింద ఉన్న జంతువులు ఈ పనిని నిర్వహిస్తూ ఉంటే ఉన్నత స్థానంలో ఉన్న మానవులు ఇటీవల దీనిని విస్మరిస్తూ ఉన్నారు. స్త్రీల రొమ్ములని పాలిచ్చే అవయవంగా కాక ఒక లైంగిక వస్తువుగా, సుఖాన్నిచ్చే సాధనంగా మార్చి వేస్తున్నారు.

రొమ్ములు చిన్నవిగా ఉన్నవాళ్ళు సిలికాన్ ఇంప్లాంట్స్‌తో ఆపరేషన్ ద్వారా వాటిని పెద్దవి చేసుకోవడం, బిగి సడలి జారిపోయాయి అనికున్నవాళ్ళు mastopexy అన్న ఆపరేషన్‌తో వక్షోజాలు రూపు మార్చుకోవడం ఇందులో భాగమే. అయితే రొమ్ములు కప్పుకోవడం తెలియని నాగరికత పూర్తిగా నెర్చుకోని తెగల్లోని వారు రొమ్ములని కేవలం పిల్లలలి పాలిచ్చే భాగాలుగా మాత్రమే చూస్తారని, వాళ్లకి అవి శృంగార సాధనాలు అన్న భావన ఉండదని శాస్త్రవేత్తలు చెబుతారు,
 
సినిమాలలో, మోడలింగ్‌లో రొమ్ములని చూపిస్తూ వాటికి sex objects ముద్ర వేస్తున్నారు. మగవారు చేసే ఈ పనికి ఆడవారు కూడా సహకరిస్తూ తమని తాము sex objects గా మార్చుకుంటున్నారు. అందులో భాగంగా బిడ్డలకి పాలివ్వడం తమ పాలిండ్ల సౌందర్యాన్ని పాడు చేస్తుందన్న అపోహ. రొమ్ముల బిగి సడలిపోతుందని సినిమా స్టార్లు, మోడల్సే కాక చాలా మంది ఆడవాళ్ళు పిల్లలకి తల్లిపాలు దూరం చేస్తున్నారు. చంటి బిడ్డలకి తల్లిపాలు ఆరోగ్యంతో బాటు రోగ నిరోధక శక్తి కూడా ఇస్తుందని డాక్టరు చెబుతున్నా వీరికి ఎక్కడం లేదు. ఇప్పుడు ఇలాంటి వారి కళ్ళు తెరిపించే నిజం మరొకటి నిపుణులు తెలుసుకున్నారు.
 
పిల్లలకి పాలివ్వడం ద్వారా తల్లికి రొమ్ము కాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కేన్సర్ కలిగించే కొన్ని రకాల హార్మోన్లు తగ్గిపోయి రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం ఉండదనీ, అలాగే రొమ్ముల్లో DNA లో మార్పు వచ్చిన కణాలు పాలివ్వడం ద్వారా తగ్గిపోతాయనీ, ఇలాంటి కణాలే ఉత్తరోత్తరా కేన్సర్ కలిగిస్తాయనీ, ఇవి తగ్గి పోవడం ద్వారా కేన్సర్ ప్రమాదం కూడా తగ్గిపోతుందనీ నిపుణులు చెబ్తున్నారు.
 
సిలికాన్ రొమ్ములతో కుర్రకారుని పిచ్చెక్కించిన బేవాచ్ స్టార్ పమేలా అండర్సన్, హాలీవుడ్ అందగత్తెలు సిండీ క్రాఫోర్డ్, డెమీ మూర్, సింగర్ సెలీన్ డియోన్ లంటి వాళ్లందరూ తమ పిల్లలకి తామే పాలిచ్చారు. తరువాత్తరువాత వెండి తెర మీద తమ బిగి సడలని వక్ష సౌందర్యాలని చూపించారు కూడా.

Tuesday, October 16, 2012

సాక్షీ, మరీ ఇన్ని అబద్ధాలా?


రాజ శేఖర్ రెడ్డి చనిపోయినప్పటినుంచీ సాక్షి పత్రికకి ప్రభుత్వంలో అసమర్ధతా, అవినీతి బాగా కనిపిస్తున్నాయి. అప్పటి వరకూ రామ రాజ్యంలో, స్వర్ణ యుగంలో సుఖ సంతోషాలతో జీవిస్తున్న ప్రజలు ఒక్క సారిగా కష్టాల కడలిలో పడి పోయినట్లు ఒక ఫీలింగ్ కలుగుతుంది ఆ పత్రిక చదివే వారికి. 
 
రెండు రోజుల క్రితం ఆరోగ్యశ్రీ గురించి అందులో ఒక వార్త వచ్చింది. ఈ పథకం కింద హాస్పిటల్స్‌లో చేరిన రోగులకి శస్త్ర చికిత్సల కోసం అనుమతి రావడం బాగా ఆలస్యం అవుతూ ఉందని, రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తూ ఉందని ఆ వార్త సారాంశం. ఈ పథకంలో కొన్ని మార్పులు చేయడమే అందుకు కారణం అని అందులో రాశారు.
 
అది నిజమా కాదా అని నెల్లూరులో ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు చేసే నా మిత్రుడయిన ఒక ఎముకల డాక్టరుకి ఫోన్ చేశాను. అతను చెప్పిన విషయం ఈ వార్తకి పూర్తి విరుద్ధంగా ఉంది. ఆపరేషన్లకి సమ్బంధించి హాస్పిటల్స్‌కి డబ్బులు చెల్లించడంలో బాగా ఆలస్యం అవుతుంది కానీ, అనుమతుల విషయంలో మాత్రం ఆలస్యం ఏమీ లేదు అని ఒక ఉదాహరణ చెప్పాడు. తుంటి కీలు విరిగిన ఇద్దరు పేషంట్లని ఈ ఆదివారం మధ్యాహ్నం హాస్పిటల్‌‍లో అడ్మిట్ చేస్తే వారికి ఆపరేషన్‌కి అనుమతి సోమవారం సాయత్రం కల్లా వచ్చేసింది అని అతను చెప్పాడు.

Sunday, October 14, 2012

భార్యల్ని మోసే పోటీ (Wife Carrying Championship)


భర్త అంటే భరించేవాడు అని అర్థం. దీనిని నిజం చేయడానికా అన్నట్లు ఫిన్‌లాండ్‌లో భార్యల్ని మోయడంలో పోటీలు నిర్వహిస్తారు. Wife carrying championships అని పిలిచే ఈ పోటీలలో ఖచ్చితంగా భార్యల్నే మోయాలి అని ఏమీ లెదు. 49 కిలోలకన్నా ఎక్కువ బరువు ఉన్న అమ్మాయి ఎవరయినా సరే భార్య కింద లెక్క. అలాంటి అమ్మాయి ఎవరినయిన మోస్తూ 253.5 మీటర్ల దూరం పరుగెత్తి ఈ పోటీలలో నెగ్గవచ్చు. ఇందులో గెలిచిన వారికి అమ్మాయి బరువు బీర్. అంతకు అయిదు రెట్లు కాష్ బహుమతిగా ఇస్తారు.ఈ పోటీలలో మధ్యలో రెండు చోట్ల హర్డిల్స్, ఒక చోట మీటరు లోతున్న నీటి గుంట ఉంటాయి. భార్యని పడేయకుండా ఈ అడ్డంకులు దాటాల్సి ఉంటుంది. 
  
ఫిన్‌లాండ్‌లో ఒకప్పుడు పెళ్ళికాని యువకులు ఊర్ల మీద పడి కంటికి నదురుగా కనిపించిన అమ్మాయిని భుజాల మీద వేసుకుని ఎత్తుకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకొనేవారట. అదే కాలక్రమేణా పెళ్ళాల్ని మోసే పోటీగా మారింది అని అంటారు. ఈ పోటీలో పెళ్ళాన్ని వీపు మీద వేసుకొని కానీ, ఒక భుజం మీద వేసుకుని కానీ మోస్తారు. అయితే బహుమతి పొందినవారిలో ఎక్కువమంది ఉపయోగించేది ఎస్టోనియన్ టెక్నిక్. ఇందులో అమ్మాయిని తలకిందులుగా వీపుమీద వేసుకుంటారు.

ఎస్టోనియన్ టెక్నిక్

ఇప్పుడిప్పుడే ఈ పోటీలు ఇతర దేశాల్లో కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి అక్టోబర్ నెలలో అమెరికాలోని మెయిన్‌లో కూడా ఈ పోటీలు పెడుతారు. ఎకోరన్ ఇండియా అన్న సంస్థ జనవరి 1,2011న భార్యా సమేతం అన్న పేరుతో ఈ పోటీని కేరళలోని త్రివేండ్రంలో నిర్వహించింది.