నచ్చిన వాళ్ళకి పూలదండలు, నచ్చని వాళ్ళకి చెప్పుదెబ్బలు పడుతుంటాయి ఇక్కడ. మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుదెబ్బలు పడినప్పుడు తిట్టుకోకుండా చదవండి. NOTHING IS PERSONAL HERE. ALL IN THE GAME,er,BLOG.

Search This Blog

Tuesday, November 30, 2010

మరొక రౌండ్ చావులు మొదలయ్యాయి!

జగన్ కాంగ్రె పార్టీకి రాజీనామా చేశాక అందరిలో ఒకటే ఉత్కంఠ తరువాతి స్టెప్ ఏమిటా అని. కానీ నాకు మాత్రం మరొక రకమైన ఉత్కంఠ. ఈ సారి ఎంతమంది చావబోతున్నారా అని. ఇదివరలో రాజ శేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు చాలా మంది చనిపోయారు. అంబటి రాంబాబు మాటల్లో భావోద్వేగాలకు గురయి గుండెలు ఆగి కొందరు, ఆత్మహత్యలు చేసుకొని మరి కొందరు, అన్నం నీళ్ళు మాని కొందరు ఇలా నానారకాలుగా చని పోయారు. తరువాత యువనేత ఓదార్పు యాత్రకి ఢిల్లీ మేడమ్ అనుమతి ఇవ్వలేదని మరికొందరు చనిపోయారు. ఓదార్పు యాత్రకి ఆటంకం కలుగుతుందని మూడవ రౌండ్ చావులు వచ్చాయి.
  
ఇప్పుడు జగన్ ఏకంగా కాంగ్రెస్ పార్టీలోంచి బయటకొచ్చాక మళ్ళీ చావుమేళం మోగకుండా ఉంటుందా అని అనుకొన్నాను. ఈ ఉదయం సాక్షి పేపర్ చూశాక సందేహం తీరి పోయింది. మొదటి రోజు స్కోరు తొమ్మిది చావులు. రేపు, ఎల్లుండి, ఆ మరునాడు, ఆ తరువాత ఈ స్కోరు ఎంతకి చేరుతుందో?
  
మొదటి రౌండ్ వాళ్ళ ఓదార్పే ఇంకా పూర్తవలేదు. జగన్ రెండు, మూడు రౌండ్ల వాళ్ళ కుటుంబాలనెప్పుడు ఓదార్చాలి? ఈ ఫ్రెష్ రౌండ్ వాళ్ళనెప్పుడు ఓదార్చాలి? తన కొత్త పార్టీ గురించి ఎప్పుడు ఆలోచించాలి? దాన్ని ఎప్పుడు బలోపేతం చేయాలి? పైపెచ్చు అన్నకి ఈ ఓదార్పులో ఇప్పటి దాకా జనాన్ని చూసి చెయి ఊపీ ఊపీ చెయ్యి నొప్పి వచ్చిన విషయం, డాక్టర్లు చెప్పినట్టు విశ్రాంతి కూడా తీసుకోకుండా మళ్ళీ తన కార్యకలాపాల్లో మునిగి పోయిన విషయం కూడా మనకి తెలుసు కదా?
 
ఈ చచ్చే వాళ్ళ చావులు జగన్ కి చచ్చేంత చావు తెచ్చి పెడుతున్నాయి కాబట్టి గుండెలవిసి, గుండాగి చచ్చే వాళ్ళకి, ఆత్మహత్యలు చేసుకొని చచ్చే వాళ్ళకి నాదో విన్నపం... మన ప్రియతమ నేత సమయం, ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఎవరూ చావకండి.అంతగా చావాలనుకొంటే రేపు మనవాడు కొత్త పార్టీ పెట్టి, ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక అప్పుడు తీరిగ్గా చావండి. అప్పుడు అన్న సీఎమ్ గా అధికారగణాన్ని వెంటేసుకొని, మందీ మార్బలంతో మీ ఇంటికొచ్చి మీ వాళ్ళని మీ చావు గురించి విచారించి ఓదారుస్తూ ఉంటే ఆ కథా కమామీషూ వేరు కదా!!??

ఇందిరమ్మ నాగు పాము అయితే సోనియమ్మ కొండచిలువ

చివరికి సోనియాతో ఆడుతున్న గేమ్ లో జగనే తొలి అడుగేశాడు. సోనియా తనకై తాను పార్టీ నుంచి గెంటేసే దాకా బయటకి పోకూడదని జగన్, తనకై తాను పార్టీని వీడెదాకా వేచిచూడాలని సోనియా ఇద్దరూ వెయిటింగ్ గేమ్ ఆడుతూ ఉంటే చివరికి సోనియా తన చుట్టు బిగించిన చక్రబంధంలో ఊపిరాడక చివరికి తనంతట తానే పార్టీని వీడి బయటపడాల్సి వచ్చింది జగన్.
     
ప్రత్యర్ధిని ఎదుర్కొనే విషయంలో సోనియా అత్తగారైన ఇందిరా గాంధీది కింగ్ కోబ్రా మెథడ్ అంటారు. అదును చూసి కాటేస్తే ఒక్క దెబ్బకి ప్రత్యర్ధి మటాషై పోవాల్సిందే. అయితే సోనియాది అందుకు విరుద్ధమైన పద్ధతి. ఇది కొండచిలువ విధానం. ప్రత్యర్ధిని చుట్టుముట్టి ఊపిరాడకుండా చేసి గిల గిల లాడేలా చేస్తుంది. ఇప్పుడు జగన్ ని ఆ పద్ధతిలోనే డీల్ చేసింది. 


ముందు జగన్ అనుచరులని పార్టీలోంచి పంపేయడమో షోకాజ్ నోటీసులిప్పించడమో చేసింది. తరువాత ముఖ్యమంత్రిని మార్చేసి రోశయ్య తరువాతైనా చాన్స్ దక్కుతుందన్న ఆశ అతనిలో దూరం చేసింది. మరో పక్క చిరంజీవిని దువ్వి జగన్ పార్టీలోంచి ఓ ఇరవై మంది ఎమ్మెల్యేలను చీల్చినా భయం లేదని చూపించింది. తరువాత జగన్ చిన్నాన్నని మంత్రి పదవి పేరుతో ఢిల్లీకి పిలిచి మచ్చిక చేసుకొంది. ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళకి అంబటి రాంబాబు చేతనే జగన్ డౌన్..డౌన్ అనిపిస్తుందేమోనని భయపడి జగన్ రాజీనామా చేసి పార్టీ లోంచి బయటకి రాక తప్పలేదు.

ఆరెంజ్ సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారంటే......?

ఈ శీర్షిక చూడగానే నేను ఆరెంజ్ సినిమా చూశానని మీకు అర్ధమైపోయిఉండాలి. నా పట్ల మీ మనసుల్లో పెల్లుబికిన సానుభూతికి ధన్యవాదాలు. విషయమేమిటంటే ఈ సినిమాకి ఆరెంజ్ అన్న టైటిలే ఎందుకు పెట్టారు? ఏ గుమ్మడికాయో,చింతకాయొ అని పెట్టలేదెందుకని అని ఈ బ్లాగుల్లో కొందరు లేవనెత్తిన ప్రశ్నకి నాకు తోచిన సమాధానం ఈ పోస్టు. 
 
దీనికి ఒక చిన్న ప్రయోగం చేయలి. అందుకు కావలసినవి ఒక ఆరెంజ్, ఒక పాత్రలొ నీళ్ళు. ఏదో పోస్టు చదువుదామని కూర్చుంటే ప్రయొగం చేయమంటాడేమిట్రా నీ ఎంకమ్మా అనుకోవద్దు. ప్రయోగం కూడా ఇక్కడే చేద్దాం. ఒక పాత్రలో నీళ్ళు నింపి అందులో ఆరెంజ్ వేయండి. అది మునగదు. ఇప్పుడు ఆరెంజ్ కి తొక్క తీసి వేయండి. నీటిలో మునిగిపోతుంది. సారాంశమేమిటంటే ప్రేమ కూడా ఆరెంజ్ లాంటిదే. దానికి అందమైన అబద్ధాల తొక్క కప్పినంతకాలం మునిగిపోకుండా ఉంటుంది. దాన్ని తొలగించిన మరుక్షణం మునిగిపోతుంది. 
  
భాస్కర్ ఈ విషయాన్నే సినిమాలో చెప్పాడు. అయితే ఈ ఆరెంజ్ ఎక్సపెరిమెంట్ సంగతి అతడి మనసులో ఉందని నేననుకోను కానీ తొక్క తీస్తె ఆరెంజ్ మునిగిపోతుందని చెప్పడానికి రెండున్నర గంటలు తను కష్టపడి, ఆడియెన్స్ ని కష్టపెట్టి నాగబాబు చేత ముప్పయి అయిదు కోట్లు ఖర్చు పెట్టించాడు. 

Sunday, November 28, 2010

అమ్మయ్య! జగన్ ఓదార్పు యాత్ర కొనసాగిస్తాడట!

రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులుగా జరిగిన పరిణామాలు గమనిస్తే జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర ఎక్కడ ఆగిపోతుందో అని భయమేసింది. రెండు నెలలుగా రాత్రనకా పగలనకా తిరిగి, తిరిగి కనిపించిన వాళ్ళందరికీ చేతులు ఊపి,ఊపి చివరికి నెల్లూరులో "నాకు సహనం నశిస్తే ఉప్పెన, సునామీ, భూకంపం, అగ్ని పర్వతం పేలుడు" అని భీకరమైన హెచ్చరికలు చేసినా అమ్మగారు ఏమీ పట్టించుకోకుండా ముసలి తాతని పీకేసి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసింది అంటే జగన్ కి ఓదార్పు మీద నమ్మకం చచ్చి పోయి ఉంటుందేమో అనుకొన్నాను. ఓదార్పు చేయడం వల్ల కంఠ శోష, కాళ్ళ నొప్పులు, చేతుల పీకుడు తప్ప మరేమీ మిగలదని నిజం తెలుసుకొని జగన్ ఓదార్పుకి మంగళం పాడేస్తాడేమో అనుకొన్నాను కానీ నిన్నో, ఇవాళో జగన్ స్పీకర్ అంబటి రాంబాబు ఏదో చానల్లో మాట్లాడుతూ "ఓదార్పు ఆగదు" అని చెప్పాక అమ్మయ్య అనుకొన్నాను.
 
ముందుగా ఓదార్పు ఎందుకు ఆగకూడదో నన్ను చెప్పనివ్వండి. ఓదార్పు అంటే అదొక నవరసభరిత నాటకం. అన్నిటికన్నా ముఖ్యమైనది కామెడీ. ప్రతి రోజు జగన్ తన తండ్రి కోసం ఎప్పుడో చనిపోయిన?వాళ్ల కుటుంబాల దగ్గరకెళ్ళి వాళ్ళని ఓదార్చి, తను ఓదార్పు పొందడం, వాళ్ళ చేత అదో ఇదో తిని ఆకలి తీర్చుకోవడం, సాక్షి పేపర్ లో, చానల్ లో పక్క రోజు ఆ ఫోటోలు పేజీల కొద్దీ, గంటల కొద్దీ రావడం....ఇదంతా ఒక పెద్ద సంబరం.
 
మరొకటేమిటంటే ఎంతో మంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు తయారు చెసే వాళ్ళకి ఓదార్పు ఉన్నంతకాలం డబ్బుకి ఢోకా ఉండదు. ఇప్పుడు ఓదార్పు ఆగిపోతే వాళ్ళు ఆల్రెడీ తయారు చేసిన విగ్రహాలు ఏం కావాలి? ప్రతిరోజూ ఓదార్పు మీటింగులకి హజరయ్యె వాళ్ళకి, వాళ్ళని హాజరు పరిచే వాళ్ళకీ ఓదార్పు యాత్ర  ఆగిపోతే నోటి కాడి కూడు పోయినట్టే.


ఇంతమందిని ఇన్నిరకాలుగా అలరిస్తున్న ఓదార్పు ఇప్పట్లో ఆగిపోకూడదని కోరుకుంటూ జగన్ కి విషెస్ ఈ పోస్టు ద్వారా తెలియజేస్తున్నాను.

సపోర్టింగ్ యాక్టరయితేనే చిరంజీవికి సరిపోతుంది.

మేం మీకు మద్ధతిస్తాం తీసుకోండి ప్లీజ్, అదే చేత్తో మాకు ఒకటో రెండో పదవులివ్వండి అని కాంగ్రెస్ అధిష్టానం వెంట చిరంజీవి పడటం కొంతమందికి వింతగా అనిపించవచ్చు. ఒక పార్టీ నాయకుడు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా ఎన్నికలలో పోటీ చేసిన వాడు ఇప్పుడు ఆ పార్టీముందు దేబిరించడం ఏమిటా అని సందేహం కలగవచ్చు. పైపెచ్చు గత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులని పంచెలు ఊడదీసి కొట్టమని మన మెగాస్టార్ తమ్ముడైన పవర్ స్టార్ తన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చి ఉన్నాడాయే! 
 
అయితే చిరంజీవినుంచి ఈ దేబిరింపు స్టాండ్ నాకు సహజమే అనిపించింది. చిరు నట జీవితాన్ని పరిశీలిస్తే ఆయన మొదట్లో సహాయ నటుడిగా మొదలు పెట్టాడు తన కెరీర్ ని.అలా అంచెలంచెలుగా సినీ ప్రస్థానంలో చివరికి మెగాస్టార్ అయ్యాడు. కానీ రాజకీయాల్లో ఒకేసారి కుంభస్థలంకేసి గురి పెట్టడం వల్లనే ఫెయిలయ్యానని ఆయన తెలుసుకొని ఉండవచ్చు. దాన్ని సరిదిద్దుకొనే ప్రయత్నంలో భాగమేమో కాంగ్రెస్ అధిష్టానాన్ని దేహీ అని అర్ధించడం.
 
ముందు ఉప ముఖ్యమంత్రిగానో, కేబినెట్ మంత్రిగానో ఒక పదవి దక్కించుకొని అధికార పీఠం రుచి చూడగలిగితే, ఆ తరువాత అంచెలంచెలుగా సోపానాలు ఎక్కి ఎదో ఒకనాటికి ముఖ్యమంత్రి కాలేకపోతానా అని మెగాస్టారుడు ప్లాన్ వేసి ఉండవచ్చు. 

Saturday, November 27, 2010

ఈ రౌండ్ సోనియా గాంధీదే!

జగన్ కాలికి బలపం కట్టుకొని ఓదార్పు ఇస్తాను తీసుకోండి అని రేయింబవళ్ళూ తిరిగి విగ్రహాలు ఆవిష్కరించి చేతులూ కాళ్ళూ నొప్పులు తెచ్చుకొన్నాడు కానీ, సోనియా గాంధి కూల్ గా హస్తిన నుంచి వ్యవహారం నడిపి సీఎంని మార్చేసి సోనియా-జగన్ ల చదరంగపు ఆటలో ఈ రౌండ్ లో తనె విజేతనని నిరూపించుకొంది.

  
  
తండ్రి ఆవేశమె తప్ప ఎత్తులు,జిత్తులూ జగన్ కి వంటబట్టలేదన్న విమర్శ ఎదుర్కోకూడదంటే తన తరువాతి ఎత్తు జగన్ చాలా జాగ్రత్తగా వేయాలి.  ఆలోచన లేని ఆవేశంతోనో, జగనన్న మడమ తిప్పడు అని ఉబ్బెసే చెంచాగాళ్ళ మాటలు వినో,మీడియా చేతిలో ఉందన్న గుడ్డి నమ్మకంతోనో, నేల మాళిగల్లో మూలుగుతూ వేలాది కోట్ల రూపాయలున్నాయన్న అహంతోనో గుడ్డిగా మూందుకు దూసుకుపోతే బొక్క బోర్లా పడి మూతి పళ్ళు రాలిపోయే ప్రమాదం ఉందన్న విషయం మనసులో ఉంచుకొని జగన్ తన తదుపరి ఎత్తు వేస్తే అది అతనికీ, అతన్ని నమ్ముకొని ఊగులాడుతున్న సురేఖ, అంబటి రాంబాబు లాంటి వారికీ మంచిది.

Friday, November 26, 2010

రోశయ్యకోసం చెమ్మగిల్లు ఒక నయనమ్ము

నాకొరకు చెమ్మగిలు నయనమ్ము లేదు అని రోశయ్య గారు బాధ పడకూడదు  అని ఈ పోస్టు. 
 
రోశయ్యగారు మీరు ఏ పరిస్థితుల్లో పీఠం ఎక్కినా దిగిపోయేనాటికి మీదైన ముద్ర(పాజిటివ్ గా)వేసి దిగుతారని అశించాను. నా ఆశ అడియాసే అయింది. ఎన్నో యుద్ధముల ఆరితేరిన మీరు చివరికి చడీ చప్పుడూ లేకుండా దిగిపోతారని అనుకోలేదు. ఆఫ్ కోర్స్ దాని వెనుక ఇటాలియన్ హస్తం ఉందనుకోండి. ఇన్ని సంవత్సరాలు నంబర్ టూగా ఉన్నా మీకంటూ ఒక ముఠా ఏర్పాటు చేసుకోకపోవడం మీకు ఎంత ప్లస్ అయిందో అది అంతే మైనస్ అయింది. కులంవెనుక దండిగా డబ్బున్నా బలమైన కులం కాకపోవడం మరొక మైనస్.


మీరు మరీ మెతక వైఖరిలో పోతున్నారని కొంచెం ధైర్యం చేయండి సార్ అని నేను కొన్నాళ్ళ క్రితం ఒక పోస్టు కూడా పెట్టాను. మీరు దానిని అప్పుడు చూడలెదనుకుంటా. ఇప్పుడెలాగూ ఖాళీయే కాబట్టి ఇక్కడ చూడండి.  http://hittingontheface.blogspot.com/2010/01/blog-post_29.html


అలాగే మీరు మహా నేతగా తయారవ్వాలంటే ఏం చేయాలో కూడా మరొక పోస్టు పెట్టాను. ఇక్కడ చూడండి.
http://hittingontheface.blogspot.com/2010/08/blog-post_22.html 
 
http://hittingontheface.blogspot.com/2010/08/blog-post_19.html


ఇన్ని సార్లు ఆర్ధిక మంత్రిగా పనిచేసి డబ్బు ఎలా దోచేయాలో కూడా తెలియక పోతే ఎలా సార్. దోచుకోవడం అంటూ మొదలు పెడితే వందలు,వేల కోట్లలోనే ఉండాలి అని రాజశేఖరుడి దగ్గర చూసి అయినా నేర్చుకొని ఉండాలి కదా? అది తెలీదనే కదా దోపిడీవిద్యలో ఆరితేరిన మరొక దిగ్గజం మిమ్మల్ని గళ్ళాపెట్టె అని పరోక్షంగా ఎత్తి పొడిచాడు.  
 
పీఠమెక్కించి అధికారమివ్వని అధినేత్రి, మా నాన్న ఖాళీ చేసిన కుర్చీ నాదే కావాలి అని పిచ్చెక్కినట్టు ఏడ్చి చచ్చిన పిల్ల నేత, మాట వినని మంత్రులూ, లెఖ్ఖ చేయని అధికారులు. చేతిలో బెత్తం పట్టుకొని రాముడు భీముడు సినిమాలో భీముడిలాగా అందర్నీ ముడ్డి మీద తన్ని పని చేయించగలిగే నైపుణ్యం లేకపోవడం వల్ల చేతకాని సీఎం అనిపించుకున్నా మీ కోసం చెమ్మగిల్లు నయనమ్ములతో ఈ పోస్టు.

Thursday, November 25, 2010

రాజ్ థాకరేకి ఇంకా పిచ్చి తగ్గలేదు.పాపం!!

రాజ్ థాకరే గుర్తున్నాడా? శివసేన నాయకత్వ పగ్గాలు దక్కలేదని దానిలోంచి విడిపోయి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అని పెట్టి బయట రాష్ట్రాల నుండి, మరీ ముఖ్యంగా బీహార్ నుంచి బొంబాయికి వచ్చిన వాళ్ళని, అమితాబ్ బచ్చన్ తో సహా టార్గెట్ చేసి, తరువాత ఎన్నికలలో శివసేన, బీజేపీ ఓటు బ్యాంకుని చీల్చి కాంగ్రెస్ నెత్తిన పాలు పోసిన మరాఠా అగ్గి బరాఠా గురించే నేను చెప్తున్నది.
 
ఈ మధ్య అస్సలు వార్తల్లోకి ఎక్కక పోవడంతో ఈ సేనానికి ఏమీ తోచలేదేమో పాపం. ఈ సారి సెన్సారు వాళ్ళ మీద పడ్డాడు. బొంబాయి ముంబాయిగా మార్చిపారేసి, ఎక్కడైనా బొంబాయి అని రాసి ఉన్న బోర్డులన్నీ పగలగొట్టినా ఇంకా కొంతమందికి బుద్ధి రాకపోవడంతో సారుకి చిర్రెత్తుకొచ్చింది. ముందుగా సినిమాల సంగతి చూద్దామని నిర్ణయించుకొని సెన్సారు బోర్డు చైర్ పర్సన్ షర్మిలా ఠాగూర్
కి ఒక నోటీసు పంపాడు.

ఏ సినిమాలో అయినా పొరబాటుగానైనా బొంబాయి అన్న శబ్దం వినిపిస్తే ఆ తరువాత జరగబోయే పరిణామాలకి సెనారు బోర్డే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఒక కటువైన హెచ్చరిక జరీ చేశాడు.
 
"ఓయ్ సన్నాసీ!What's in a name? అని షేక్స్ పియర్ అనే ఒకాయన ఎప్పుడో చెప్పాడు. బొంబయి అని పిలిస్తే తగ్గేది, ముంబాయి అని పిలిస్తే ఎక్కువయ్యేది ఏమైనా ఉందా? నీకు చేతనయితే బొంబాయి లేదా ముంబాయిలో ఎంతోమంది తిండి అల్లాడేవాళ్ళున్నారు, వాళ్ళకోసం ఏదైనా చెయ్యి.  


మురికి వాడల్ని అభివృద్ధి చేసి నీకు ఇష్టమైన బొంబాయి/ముంబాయిని కొంచెం అందంగా తీర్చిదిద్దు. అంతే కానీ, కూటికీ గుడ్డకీ పనికి పనికి రాని విషయాల మీద రాద్ధాంతమెందుకు?" అని ఈ బ్లాగు రాజ్ థాకరే మహాశయుడిని ప్రశ్నిస్తూంది.

షీలాది మున్నీ కంటే బాగా ఉంటుందా?

ఈ సంవత్సరంలో హిట్టుగా పేరు తెచ్చుకొన్న సల్మాన్ ఖాన్ సినిమా దబాంగ్ లోని మలైకా ఆరోరా ఖాన్ ఐటెమ్ సాంగ్ "మున్నీ బద్ నామ్ హుయే డారిలింగ్ (డారిలింగే,డార్లింగ్ కాదు) తెరే లియే అన్న పాటని అందరూ ఐటెమ్ సాంగ్ ఆఫ్ థి ఇయర్ 2010 అని మెచ్చుకొన్నారు.
  
ఆ పాటకి కొరియోగ్రఫీ చేసింది ఫరా ఖాన్. అందులో మలైకా తన వక్ష స్థలాన్ని ఊపిన ఊపుడుకి ఆడియెన్స్ కి దిమ్మ తిరిగి పోయింది. మైండ్ బ్లాకైందో లేదో తెలీదు. ఆ సినిమాకి నిర్మాత సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్. ఇతను మలైకాకి మొగుడు కూడా. ఐటెం సాంగుకి వేరే ఎవరినో తీసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకని అనుకున్నాడో లేద ఆ ఇచ్చేదేదో పెళ్ళానికే ఇద్దాం అనుకున్నాడా ఏమో కానీ పెళ్ళాం తోనే లాగించేశాడు. అమ్మడు కూడా అద్భుతంగా నాట్యం చేసి మొగుడి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టింది.

మున్నీ పాటని మీరు కావాలనుకొంటే ఇక్కడ చూడొచ్చు:.   http://www.youtube.com/watch?v=eoRMObjVhQM&feature=related

ఇప్పుడు ఫరా ఖాన్ సొంతంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా తీస్ మార్ ఖాన్ రెడీ అవుతూంది. ఈ సినిమా ఆడియోని కూడా వెరైటీగా బొంబయి నుండి లోనావాలాకి ఒక ట్రైన్ బుక్ చేసుకొని అందులో రిలీజ్ చేసింది ఫరా. ఈ సినిమాలో షీలా కీ జవానీ అన్న ఐటెం సాంగ్ ని కత్రినా కైఫ్ మీద తీస్తూంది ఫరా. సహజంగానే దీనికి తనే కోరియోగ్రఫీ చేస్తూంది. షారుఖ్ ఖాన్ లేకుండా ఫరా ఖాన్ తీస్తున్న మొదటి సినిమా కాబట్టి ఇది హిట్టు కావడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. అందులో భాగంగానే షీలా పాటని మున్నీ పాటకన్నా సూపర్ అనిపించాలని ఫరా పట్టుదలగా ఉందని చిత్రం యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
 
మున్నీలో మలైకా వక్షాన్ని ఊపితే షీలాలో కత్రినా నడుము షకీరాలాగా తిప్పి బెల్లీ డాన్సు చేసింది. పాపం కత్రినా నడుము తిప్పి తిప్పి చివరికి మూడు రోజులు నడుం పట్టేసి నొప్పితో బాధ పడిందట. షీలా పాటలో ఒక భాగాన్ని ఇక్కడ చూడొచ్చు:  http://www.youtube.com/watch?v=hcKtDXUb6Cg


షీలా పాట ఐటెం సాంగ్ ఆఫ్ థి ఇయర్ 2011 అవుతుందని ఫరా ఖాన్ చాలా నమ్మకంగా చెప్తూందట. సరే చూద్దాం.

Wednesday, November 24, 2010

అమ్మాయిలు లేచిపోకుండా సెల్ ఫోన్లు నిషేధించిన గ్రామం

ముజఫర్ పుర్ లోని లాంక్ అనే గ్రామంలో అన్ని మతాలకూ,కులాలకూ చెందిన పెద్దలందరూ కలిసి పెళ్ళికాని అమ్మాయిలు అబ్బాయిలతో లేచిపోవడం ఈ మధ్య ఎక్కువైపోతున్నందుకు కడు చింతించి అందుకు కారణం కూడా కనుక్కొని దానికి పరిష్కారం కూడా కనిపెట్టి అమలు పరిచిపారేశారు.
 
కుల మత తారతమ్యాలు మరిచి అందరూ ఒక్కతాటిపై నిలిచి కనుక్కొన్న పరిష్కారం ఏమిటంటే పెళ్ళికాని అమ్మాయిలు అబ్బాయిలతో లేచిపోవడానికి అసలు కారణం సెల్ ఫోన్ అని తీర్మానించి, పెళ్ళి కాని అమ్మాయిలు సెల్ ఫోన్ వాడ్డానికి వీల్లేదని ఒక తీర్మానం చేశారు. 

కుల మత వైషమ్యాలు మరిచి అందరు పెద్దలూ ఒక తాటిపై నిలవడం ఆనందదాయకమే కానీ కేవలం సెల్ ఫోన్ వాదకం నిషేధించినంత మాత్రాన ప్రేమలు,లేచిపోవడాలు ఆగుతాయా అన్నది సందేహమే కదా? ఎందుకంటే సెల్ ఫోన్ రాకముందు కూడా ప్రేమలూ,లేచి పోవడాలు ఉన్నాయి కదా?


పనిలో పనిగా టీవీని కూడా నిషేధించి పారేయాలి కదా? పొద్దున లేస్తే టీవీ సీరియల్స్ నిండా అవే ముచ్చట్లు కదా? అలాగే అసలైన లేచిపోవడాలు, లేపుకు పోవడాలు పుష్కలంగా ఉండే సినిమాలని కూడా నిషేధించేస్తే ఇంకా మంచిది కదా! ఇంక మనో ఉల్లాసానికి మార్గమేమిటా అనుకొంటే నవలలు, కథలు కాకరకాయలు చదువుకొంటే అందులో కూడా అవే ముచ్చట్లుంటాయి కదా?
 
ప్రేమ కథలు,నవలలు మానేసి హాయిగా రామాయణం, భారతం, భాగవతాలు చరిత్ర చదువుకోవచ్చు కదా అనుకొంటే అందులో ఈ విషయాలుండవని గ్యారంటీ ఏముంది? రుక్మిణిని ఆమె స్వయంవరం నుంచి కృష్ణుడు లేవదీసుకుపోవడం, సంయుక్తని పృధ్వీరాజు లేవదీసుకు పోవడం లాంటి విషయాలు ఆ అమ్మాయిల మనసుల్ని పాడు చేయవా?
 
అయినా ఆ పెద్దలందరూ కలిసి మరికొంచెం మనసు పెట్టాలే కానీ ఈ సమస్యకు ఫూల్ ప్రూఫ్ సొల్యూషన్ కనుక్కోవడం ఎంతసేపు! అసలు పెళ్ళికాని అమ్మాయిలని అబ్బాయిలని వేర్వేరుగా పెళ్ళయ్యేవరకూ బందిఖానాలో పెట్టేస్తే ఓ పనయిపోదూ?


అయినా వాళ్ళెంతసేపూ పెళ్ళికాని అమ్మాయిల గురించే ఆలోచిస్తే ఎలా? పెళ్ళయిన అమ్మాయిలు తాము అంతకు ముందు ప్రేమించిన అబ్బాయిలతో పెళ్ళయ్యాక లేచి పోకూడదని ఏమైనా గ్యారంటీ ఉందా?

Tuesday, November 23, 2010

సాక్షి కథనం-స్టూడియో-N కి ఇంధనం-అసలు కారణం జగన్ లోకేష్ ల మధ్య పోటీయా?

సాక్షి టీవీలో ప్రసారమైన హస్తం గతం కథనం సోనియా గాంధీలో కానీ ఆమె విధేయులలో కాని ఎంత రియాక్షన్ తెప్పించిందో తెలియదుకానీ స్టూడియో N లో మాత్రం చాలా స్టిములేషన్ తెప్పించింది. నిన్నా,మొన్నా ఆ చానల్ అదే పనిగా ఆ స్టోరీని రిపీట్ చేసి, దాని పైన వెల్లువెత్తిన నిరసనల్ని,ఖండనల్ని పదే పదే చూపించింది. ఒక వైపు బాక్స్ కట్టి సాక్షి కథనం తప్పు అన్న వాక్యం, దానికి ఇటు వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోటోలు మార్చి మార్చి చూపించింది.
 
స్టూడియో-N టీడీపీ చానల్ అని అందరికీ తెలుసు కాబట్టి జగన్ చానల్ ని దుమ్మెత్తి పోసింది అనుకొంటే, ఆ రియాక్షన్ వెనక కొచెం సోనియాని సమర్ధిస్తున్నట్లు, సానుభూతి చూపుతున్నట్టు కూడా అనిపించింది. దీని వెనక అసలు కారణం నా ఉద్ధేశ్యంలో జగన్ కి లోకేష్ (చంద్రబాబు తనయుడు, స్టూడియో-N కి సీఈఓ గా వ్యవహరిస్తున్నాడు)కి మధ్య ఉన్న peer pressure అయ్యుండవచ్చు.
 
చంద్రబాబు, వైఎస్సార్ ఎలా సమకాలీనులో, వాళ్ళ కొడుకులు కూడా అలాగే సమ వయస్కులు. జగన్ ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంటే లోకేష్ స్టాన్ ఫోర్డ్ లో చదువుకొంటూ గడిపేశాడు. మొన్నీ మధ్యనే బాలకృష్ణ కూతుర్ని పెళ్ళి చేసుకొని వార్తల్లో కొచ్చాడు. గత ఎన్నికలలో తెలుగుదేశానికి నగదు బదిలీ పథకం అనే ఆయుధాన్ని అందించింది లోకేషే. అది అనుకొన్నట్లుగా పని చేయలేదు. అది వేరే సంగతి.


చంద్ర బాబు మిగతా కుటుంబ సభ్యుల్ని రాజకీయాలకు దూరంగా పెట్టినట్లే కొడుకుని కూడా పార్టీకి, రాజకీయాలకు దూరంగా పెట్టాడు. మరో వైపు జగన్ తండ్రి వర్గాన్ని వైఎస్ బతికున్నపుడే మానేజ్ చేస్తూ, తనకంటూ బలమైన వ్యాపార, రాజకీయ సామ్రాజ్యాన్ని, సమాచార సామ్రాజ్యాన్ని నిర్మించుకొన్నాడు. ఇప్పుడిప్పుడే లోకేష్ తమ దగ్గరి బంధువులకి చెందిన(ఇందులో బాబుగారి పెట్టుబడి ఉందేమో నాకు తెలియదు) స్టూడియో-N చానల్ ని నిర్వహిస్తూ మీడియాలో అడుగు పెట్టాడు.


తరగతిలో ఇద్దరు విద్యార్ధుల మధ్య, ఒకే కుటుంబంలోని ఇద్దరు సమవయస్కుల మధ్యా పోటీ ఉన్నట్లు సహజంగానే జగన్ లోకేష్ ల మధ్య కూడా అంతర్లీనంగా పోటీ ఉండి ఉంటుంది. ఆ పోటీలో భాగమే ఆ మధ్య స్టూడియో-N లో వచ్చిన జగన్ రాజ ప్రాసాదాల కథనాలు అని నేననుకొంటున్నాను. ఇప్పుడు జగన్ ని దుమ్మెత్తి పోయడానికి స్టూడియో-N కి హస్తం గతం కథనం, దాని పైన వెల్లువెత్తిన నిరసనలు మరొక బంగారం లాంటి అవకాశాన్ని అందించాయి. దాన్ని లోకేష్ పూర్తిగా వాడుకొంటున్నాడు అని నా అభిప్రాయం. 


ఎవరైనా మానసిక విశ్లేషణా నిపుణులు దీన్ని మరింత లోతుగా పరిశీలించాల్సి ఉంది.  

Monday, November 22, 2010

స్వాములూ ముక్కు మూసుకొని తపస్సు చేసుకోకుండా ఈ రొచ్చులో వేలెట్టడమెందుకు?

తన పదవిని కాపాడుకోవడానికి యెడ్యూరప్ప నానా తంటాలు పడుతుంటే ఆయనకి నేనున్నానంటూ విశ్వేశ్వరతీర్థ స్వామి ముందుకొచ్చాడు. ఈయన ఉడుపిలోని పెజావర్ మఠాధిపతి. తప్పు నిరూపితమయ్యేవరకూ యెడ్యూరప్పమీద ఎలాంటి చర్యా తీసుకోకూడదు అని హుకుం జారీ చేశారు స్వామిగారు.
  
 "స్వామిగారూ రాజకీయాలంటే రొచ్చు. పైపెచ్చు ఇప్పుడు మీ అనుంగు శిష్య పరమాణువు ఇరుక్కున్నది మరింత కంపుకొట్టే రొచ్చు. ఆయన మానాన ఆయన్ని వదిలేసి మీ మానాన మీరు కృష్ణా రామా అనుకోకుండా ఆ కంపులో వేలు పెట్టడం ఎందుకు చెప్పండి?"

Saturday, November 20, 2010

జగన్ సోనియా ఇద్దరూ(తోడు) దొంగలేనా?

ఇంతకాలం ముసుగులో గుద్దులాటలాగా సాగుతున్న జగన్ సోనియాల పోరాటంలో ఈ రోజు జగన్ ఒక కొత్త రౌండ్ మొదలు పెట్టాడు తన చానల్లో సోనియా మీద డైరెక్ట్ అటాక్ చేయడం ద్వారా?
 

జగన్ మీద వేల కోట్ల అవినీతి ఆరోపణలున్నాయి. జగన్ బావ ఇతర కుటుంబ సభ్యులది కానీ, జగన్ వెన్నంటి ఉండే యూత్ బ్రిగేడ్ నాయకులది కానీ అవినీతి మచ్చ లేని చరిత్రేమీ కాదు. ఎకరాల కొద్దీ విస్తీర్ణంలో హైదరాబాద్, బెంగళూరులో జగన్ కట్టిన కోటల్ని చూసి అదంతా నీతి నిజాయితీలతో సంపాదించిన సొమ్ము కాదని చెప్పడానికి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అఖ్ఖర్లేదు.
 
కేంద్ర నిఘా సంస్థలూ, సీబీఐ,ఏసీబీ, ఈడీ గట్రా అన్నీ సోనియాజీ గుప్పిట్లో ఉన్నాయి. అయినా జగన్ బాబు ఏమీ జంకడం లేదు అంటే ఆవిడ లోగుట్టు కూడా ఈయనకు ఎరికే అన్న నిర్ధారణకు రావాల్నా?


మహానేత గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పటికప్పుడు అమ్మగారి వాటా ఆమెకు ఠంచనుగా అందేదని గుసుగుసలున్నాయి. ఆ విషయాలన్నీ యువనేతకు తెలియకుండా ఉంటాయా? అవెక్కడ బయటకొస్తాయో అని పిల్లవాడి పిర్ర మీద నాలుగు అంటించి దారిలో పెట్టడానికి మేడమ్ జంకుతున్నారా?


ఈ ఇద్దరి లోగుట్టు బయటపెట్టే పెరుమాళ్ళు ఎవరైనా వస్తే బావుణ్ణు. మరి లోగుట్టు పెరుమాళ్ళుకే కదా ఎరిక?

Friday, November 19, 2010

ముందే చెప్పాను కళ్యాణ్ రామ్ కత్తి మటాషని!

కత్తి సినిమా టైటిల్ కోసం గొడవపడి కత్తికి ముందు కళ్యాణ్ రామ్ అని తగిలించినప్పుడే టైటిల్ కోసం గొడవ పడ్డ ఏ సినిమా కూడా బతికి బట్టకట్టలేదు అని ఒక పోస్టు పెట్టాను.
http://hittingontheface.blogspot.com/2010/10/blog-post_7453.html

మహేష్ దారిలో వెళ్ళి కత్తిని కళ్యాణ్ రామ్ కత్తిగా మార్చుకొన్న సినిమా కూడా మహేష్ ఖలేజా దారిలోనే  ప్రయాణంచేస్తూంది  .


 
 
కాబట్టి నీతి ఏమిటంటే టైటిల్ కోసం కాదు మంచి కథలపైన దృష్టి పెడితే అందరికీ శ్రేయస్కరంగా ఉంటుంది.